కుంటాల, జూన్ 12
కుంటాల మండలంలోని కల్లూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఎల్ఓలకు, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కుంటాల మండలంలోని కల్లూరు గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ఫారాలను పరిశీలిస్తూ వాటిని ఎలా సక్రమంగా నింపాలి, ఏ వివరాలు నమోదు చేయాలి, అవసరమైన పత్రాలను ఎలా జత చేయాలనే అంశాలపై బీఎల్ఓలు, సంబంధిత అధికారులకు క్షుణ్ణంగా సూచనలు చేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించాలని, ప్రజలు మరియు బీఎల్ఓలకు ఎదురయ్యే సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫారాల భర్తీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరికి అవగాహన కల్పిస్తూ నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ అడే కమల్ సింగ్, మండల అభివృద్ధి అధికారి అల్లాడి వనజ, గ్రామ సర్పంచ్ పెంటేవార్ దశరథ్, బీఎల్ఓ గంగాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.












