Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
సాహిత్య సామ్రాట్, ప్రజా రచయిత అన్నాభావు సాఠే 106వ జయంతి సందర్భంగా తానూర్ మండల ఏబీఎస్ క్రాంతి ఫోర్స్ అధ్యక్షుడు సురేష్ వాడ్ సాహేబ్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదరికం, వివక్షలకు వ్యతిరేకంగా రచనలు చేసిన సాఠే సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.
సాహిత్య సామ్రాట్, ప్రజా రచయిత, సామాజిక ఉద్యమకారుడు అన్నాభావు సాఠే 106వ జయంతి సందర్భంగా తానూర్ మండల ఏబీఎస్ క్రాంతి ఫోర్స్ అధ్యక్షుడు సురేష్ వాడ్ సాహేబ్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికం, వివక్షలను ఎదుర్కొంటూ ప్రాథమిక విద్య లేకపోయినా స్వయంకృషితో అక్షరజ్ఞానం సంపాదించి, సమాజ చైతన్యానికి తన రచనలను అంకితం చేసిన మహనీయుడు అన్నాభావు సాఠేనని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే నవలలు, కథలు, నాటకాలు, జానపద గేయాలతో ఆయన సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు.
అలాగే విలేకరిగా పనిచేస్తూ సామాన్య ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో అన్నాభావు సాఠే విశేష కృషి చేశారని కొనియాడారు. కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, మహిళల హక్కుల కోసం ఆయన కలంతో పోరాడారని తెలిపారు.
'ఫకీరా' వంటి రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడి, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా నైతిక మద్దతు తెలుపుతూ ప్రత్యేక రచనలు చేసిన మహనీయుడిగా అన్నాభావు సాఠే చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు.
సాహిత్యం, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన అన్నాభావు సాఠే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ వాడ్ సాహేబ్ రావు పిలుపునిచ్చారు.











