శ్రీలక్ష్మిని విచారించాల్సిందే: హైకోర్టు తీర్పు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహా రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని.. ఆమె పాత్ర సుస్పష్టంగా ఉందని.. తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీలకు అవకాశం కల్పిస్తున్నట్టు తేల్చి చెప్పింది. వాస్తవానికి ఇదే కోర్టు గతంలో గనుల కేసులో శ్రీలక్ష్మికి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు రెండు మాసాల కిందట.. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని తెలుస్తోందని.. ఆమెను కేసు నుంచి ఎలా తప్పిస్తారని.. ప్రశ్నించింది. మరోసారి దీనిపై హైకోర్టు విచారణ చేసి.. ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. దీంతో హైకోర్టులో మరోసారి శ్రీలక్ష్మి.. తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ.. రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీలక్ష్మి కేసును విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
సీబీఐ వాదనలు వినకుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె పాత్రను మరోసారి నిగూఢంగా విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజాగా మరోసారి ఈ కేసును విచారించిన హైకోర్టు.. శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు అదికారులకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపింది.
కాగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి.. శ్రీలక్ష్మి అన్ని అనుమతులు ఇచ్చారని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది సీబీఐ చేసి ఆరోపణ. అయితే.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలకు మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, అధికారిగా తన పాత్ర పోషించానని శ్రీలక్ష్మి చెబుతున్నారు. అందుకే.. ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు