ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా మంథనిలో ఆయన విగ్రహాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా, మంథని పట్టణ పరిధిలోని శ్రీపాద కాలనీలో ఏర్పాటు చేసిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్ధంతి సందర్భంగా, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి శ్రీపాదరావు పేరు మీద దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, శ్రీపాదరావు ఒక గొప్ప నాయకుడని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. శ్రీధర్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. శ్రీపాదరావు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.












