సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబిసి ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కొండపలకల వేణుమాధవ్, ప్రాంతీయ కార్యదర్శి ఆలేటి రమేష్ మాట్లాడుతూ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన ఫూలే, సమ సమాజ స్థాపనకు మార్గదర్శకులని కొనియాడారు.
బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫూలేకు నివాళులర్పించిన అనంతరం, ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ, కుల, లింగ వివక్షను రూపుమాపి, అందరికీ సామాజిక న్యాయం అందించాలని పోరాడారని తెలిపారు. విద్య ద్వారానే సబ్బండ వర్ణాలు పురోగమించగలవని ఫూలే విశ్వసించారని, ఆయన ఆశయాలు నేటికీ ఆచరణీయమైనవని పేర్కొన్నారు.
మహిళాభ్యుదయానికి ఫూలే చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన భార్య సావిత్రీబాయి ఫూలేకు విద్యనందించి, చదువుకోలేని మహిళలకు విద్యను అందించాలనే సంకల్పాన్ని ఆయన నెరవేర్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ సింగ్, ప్రాంతీయ కార్యదర్శి శేఖర్, ఎస్ఎంఓ కందుల సుబ్బారావు, ఆఫీసర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. తిరుపతి, ప్రాంతీయ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, బిఎంఎస్ నాయకులు మూల రమణారెడ్డి, ఉడుత సాయి, కాపర్తి సతీష్, రాహుల్ ముదిమడుగుల, పులస కిరణ్, ఎన్ తిరుపతి, యామ కళ్యాణ్, సీనియర్ మేనేజర్ మురళీధర్ స్వామితో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.












