వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ శివారులోని శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. అశేష భక్తజనం మధ్య జరిగిన ఈ వేడుకల్లో భక్తిశ్రద్ధలతో కూడిన భజనలు, సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి, అవధూత బ్రహ్మ, స్పర్శజ్ఞాని శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో బుధవారం సప్త భజనలు ఘనంగా ముగిశాయి. గురు పౌర్ణమి వేడుకల్ని అశేష భక్తజనం మధ్య భక్తిశ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు.
సాయిబాబా దేవాలయం, ధ్యాన మందిరంలో ప్రభాతవేళ అర్చకులు పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం గోవింద గిరి స్వామి శిష్యులు, భజన కళాకారులు "గురుని రూపం గురుని రూపం దివ్యమైనది గురుని రూపం, మూడు కొండలు గల పర్వతంబు వెలుగు చీకటి లేనట్టి స్థలము, శ్రీనివాస తిరుపతి వెంకటేశ దీనబంధు రక్షించు సర్వేశ, వడ్డీ కాసులవాడా గోవిందా, నిన్ను కన్నులా జూడక ఎన్ని దినములాయెనయ్యా" అంటూ చక్కని భజనలు చేశారు.
తదనంతరం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మెండె పద్మిని మహేందర్ దంపతులు, కుటుంబ సభ్యులు గురుపాదుకాపూజ చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్న గడ్డి అక్షర మహాగణపతిం, ఆండాలమ్మ అనే పాటపై చక్కటి క్లాసికల్ నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఏడు రోజులు ఏడు రాత్రులు నిరవధికంగా వీణను ధరించారు. వీణను తొలిరోజు ధరించిన గోవింద గిరి స్వామి శిష్యుడు శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త భజనలకు, వీణాధారణకుకు ఉద్వాసన పలికారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును పంచే గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర రోజే గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. నాలుగు వేదాలను విభజించి, మహాభారతాన్ని మరియు పురాణాలను రచించిన ఆది గురువు వేద వ్యాసుడు ఆషాడ పౌర్ణమి రోజున జన్మించారు. గోవింద గిరి స్వామి సైతం తమను విశ్వసించిన ఎందరికో చక్కటి దిశ మార్గనిర్దేశం చేశారు. ఏడాది కోమారు భక్తులందరూ కలిసి ఇలా గురు పౌర్ణమి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భంగా ఆశ్రమంలో కనీవిని ఎరుగని రీతిలో గురు పౌర్ణమి వేడుకల్ని నిర్వహించుకున్నాం అని అన్నారు.
గురు పౌర్ణమి వేడుకల్లో కమిటీ సభ్యులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలలోని గోవింద గిరి స్వామి శిష్యులు, భజన కళాకారులు, సాయి సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












