** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ పార్టీ మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 37 రోజులపాటు సాగిన ఆందోళనలకు మద్దతు అందించడం వల్లే యువతకు ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్టు చేశారు.
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ పార్టీ మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 37 రోజులపాటు సాగిన ఆందోళనలకు మద్దతు అందించడం వల్లే యువతకు ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేసిన అభిజీత్ దీప్కే, ఈ సుదీర్ఘ పోరాటం తమ బృందానికి ఎంతో సవాలుతో కూడుకున్నదని చెప్పారు. విమర్శలు, సందేహాలు ఉన్నప్పటికీ ఉద్యమానికి అండగా నిలిచిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనేక వారాలుగా నిరంతర కార్యకలాపాల తర్వాత తాను హాయిగా విశ్రాంతి తీసుకోగలిగానని అన్నారు. అయితే, ఆందోళనలు విరమించడంతో ఉద్యమం ముగిసినట్లు కాదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
"ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎట్టకేలకు నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. 'తర్వాత ఏం చేయాలి ?', 'ఈ సాయంత్రానికి ఏం జరుగుతుందో, జరగదో' అనే ఆందోళన లేకుండా నా బెడ్రూమ్లో నిద్రలేచాను. ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు. గత 37 రోజుల్లో మేము ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా చాలా కష్టమైనవి. ఇది నాకు మాత్రమే కాదు, మా బృందం మొత్తానికి ఏమాత్రం సులభం కాదు. అందరూ మమ్మల్ని సందేహిస్తున్న సమయంలో మాకు మద్దతునిచ్చిన, మాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు."
శనివారం జంతర్ మంతర్ వద్ద కృతజ్ఞతలు చెప్పడానికి వేచి ఉన్న వారందరినీ తాను కలవలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానని, దీనికి కారణం టైఫాయిడ్, తీవ్రమైన జ్వరం ఉండటంతో ఇంటికి రావాల్సి వచ్చిందని తెలిపారు. "ఈ దేశం కోసం మీరు చేసిన పనిని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే మేము దీనిని సాధించలేకపోయేవాళ్లం. మీ అందరికీ సెల్యూట్. మీరు మమ్మల్ని విమర్శించకపోయి ఉంటే, మమ్మల్ని ప్రశ్నించకపోయి ఉంటే, బహుశా మేము మమ్మల్ని మేము మెరుగుపరచుకునే అవకాశం పొందేవాళ్లం కాదు. మీ విమర్శలు, ప్రశ్నల వల్లే మేము మమ్మల్ని మెరుగుపరచుకోగలిగాము. అందుకే మేము ఆశించిన ఫలితాలను సాధించగలిగామని నేను భావిస్తున్నాను."
నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగా ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, 'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉందని, కచ్చితంగా తాము చాలా దూరం వెళ్తామని అభిజీత్ దీప్కే చెప్పారు.












