** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
దేశానికే గుజరాత్ మోడల్ రాష్ట్రమంటూ కేంద్రం గొప్పలు చెబుతుంటే, విద్యా రంగంలో ఈ రాష్ట్రం గణనీయంగా వెనుకబడి ఉందని తాజా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) పురోగతి నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో నమోదు, విద్యార్థుల అభ్యసన ఫలితాలలో గుజరాత్ జాతీయ సగటు కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
దేశానికే గుజరాత్ మోడల్ రాష్ట్రమంటూ కేంద్రం గొప్పలు చెబుతుంటే, చదువులో ఈ రాష్ట్రం వెనుకంజలో ఉన్నట్టు తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) పురోగతి నివేదిక, పాఠశాల విద్య, ఉన్నత విద్యలో నమోదు, విద్యార్థుల అభ్యసన ఫలితాలలో గణనీయమైన అంతరాలను ఎత్తి చూపడంతో గుజరాత్ విద్యా రంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనేక కీలక విద్యా సూచికలలో గుజరాత్ జాతీయ సగటు కంటే వెనుకబడి ఉందని ఈ నివేదిక తెలుపుతోంది. ఇది విద్యార్థులు చదువు కొనసాగింపు, ఉన్నత విద్య, తరగతి గది అభ్యసనంపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
2024-25 ఎస్డీజీ పురోగతి నివేదిక ప్రకారం, గుజరాత్లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారు. ఇది జాతీయ సగటు అయిన 61.14 శాతం కంటే తక్కువ. అదే విధంగా 49.18 శాతం మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేయరని గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే, దాదాపు ప్రతి ఇద్దరు విద్యార్థులలో ఒకరు ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేయకముందే చదువు మానేస్తున్నారు. ఇది నివేదికలో ఎత్తి చూపిన అతిపెద్ద ఆందోళనలలో ఒకటి కావడం గమనార్హం. అంతేకాక, గుజరాత్ జాతీయ సగటు కంటే 10 శాతం పాయింట్లకు పైగా వెనుకబడి ఉంది. దీన్ని బట్టి విద్యార్థులు పాఠశాల విద్యను చివరి వరకు కొనసాగించడంలో తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని సూచిస్తోంది.
విద్యార్థులు పాఠశాల నుంచి కళాశాలకు మారడం మరో ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. నివేదిక యొక్క 2022-23 తాత్కాలిక డేటా ప్రకారం, తృతీయ (కళాశాల) విద్యలో గుజరాత్ స్థూల నమోదు నిష్పత్తి 26.2 శాతం కాగా, జాతీయ సగటు 29.5 శాతంగా ఉంది. ఈ గణాంకాల ప్రకారం, అర్హత ఉన్న విద్యార్థులలో దాదాపు 73.8 శాతం మంది అధికారిక ఉన్నత విద్యా వ్యవస్థకు దూరంగానే ఉన్నారు. ఈ పనితీరుతో కళాశాల నమోదు విషయంలో గుజరాత్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 23వ స్థానంలో ఉంది.
ప్రాథమిక స్థాయిలో పాఠశాల నమోదులోనూ అంతరాలు ఉన్నాయని కూడా నివేదిక సూచిస్తోంది. గుజరాత్ నికర నమోదు నిష్పత్తి (ఎన్ఈఆర్) ప్రాథమిక స్థాయిలో 77.9 శాతంగా, ఉన్నత ప్రాథమిక స్థాయిలో 67.5 శాతంగా ఉంది. ఈ సంఖ్యలు మాధ్యమిక విద్యకు చేరకముందే గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు అధికారిక పాఠశాల వ్యవస్థకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఎస్డీజీ పురోగతి నివేదిక గుజరాత్ విద్యా రంగంపై ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నివేదికలోని సమిష్టి ఫలితాలు గుజరాత్ మొత్తం విద్యా వ్యవస్థలో ఇబ్బందులను ఎదుర్కొంటోందని సూచిస్తున్నాయి. 12వ తరగతి వరకు విద్యార్థులను నిలుపుకోవడం, ఉన్నత మాధ్యమిక విద్యలో నమోదును పెంచడం, కళాశాల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, భాష, గణితంలో తరగతి గది అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, ప్రాథమిక స్థాయి నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అధికారిక పాఠశాల వ్యవస్థలోనే ఉండేలా చూడటం వంటివి ఈ సవాళ్లలో ఉన్నాయి.












