** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
గత మూడేళ్లలో రాష్ట్రంలో 972 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మూతపడటంతో 5.86 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా పాఠశాలల మూసివేత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలలు ప్రతియేటా తగ్గుతున్నాయి. విలీనం, రేషనలైజేషన్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా వందల సంఖ్యలో మూసివేస్తోంది. పాఠశాలలు మూసివేత గత వైసిపి ప్రభుత్వంలో, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. పేదలు చదువుకునే 972 పాఠశాలలకు గత మూడేళ్లల్లో రెండు ప్రభుత్వాలు కలిసి తాళాలు వేయడం ఆందోళనకరం. వీటిల్లో ప్రభుత్వ బడులు 778 ఉండగా, ఎయిడెడ్ బడులు 194 ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యాసంవత్సరం మధ్య 664 పాఠశాలలు మూతపడ్డాయి. మరోపక్క గడిచిన మూడేళ్లల్లోనే సర్కారు బడికి 5,86,666 మంది విద్యార్థులు దూరం కావడం ఆందోళనకర అంశంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి బాగుపడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థల్లో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావమే ఈ పరిస్థితులకు కారణమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన యునిఫైడ్ డిస్ర్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యూకేషన్ (యుడైస్) ప్లస్ లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 45 వేలు, ఎయిడెడ్ పాఠశాలలు 991 ఉన్నాయి. 2025-26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు సంఖ్య 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 797కు చేరింది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 1,25,484 మంది విద్యార్థులు చదువుకున్నారు. 2025-26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 34,93,450కు, ఎయిడెడ్లో 95,710కు పడిపోయింది.
ప్రభుత్వ పాఠశాలలు మూతపడతుండగా మరోపక్క ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,232 ఉండగా, అందులో చదివే విద్యార్థుల సంఖ్య 45,53,380గా ఉంది. 2025-26 లెక్కల ప్రకారం పాఠశాలలు 15,710కు పెరగగా, మరోపక్క విద్యార్థుల సంఖ్య 48,40,296కు చేరింది. అంటే రెండేళ్లల్లో 478 ప్రైవేట్ పాఠశాలలు పెరగగా, అదనంగా 2,86,916 మంది విద్యార్థులు పెరిగారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. యుడైస్ ప్లస్ లెక్కల ప్రకారం గత విద్యా సంవత్సరం 34.93 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 32 లక్షలకు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ ఇంకా బయటకు చెప్పడం లేదు.
విద్యా సంవత్సరం | ప్రభుత్వ | ప్రైవేట్ | ఎయిడెడ్ | ఇతర | మొత్తం 2023-24 | 45,000 | 15,232 | 991 | 150 | 61,373 2024-25 | 44,886 | 15,473 | 838 | 120 | 61,317 2025-26 | 44,222 | 15,710 | 797 | 114 | 60,843












