దసరా రిటర్న్ జర్నీ..
హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ..
యాదాద్రి: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగియడంతో రిటర్న్ జర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. ఈ మేరకు చౌటుప్పల్లో వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. బస్టాండ్, స్టాప్ పాయింట్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్టాండ్ వద్ద ప్రయాణికులు బస్సులు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగులకు దసరా సెలవులతోపాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది. దీంతో ఇవాళ (ఆదివారం) నగరానికి చేరుకుని రేపు(సోమవారం) ఆఫీస్లకు వెళ్లాలనే ఆలోచనతో అందరూ ఒకేసారి హైదరాబాద్ నగరానికి తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.