నిర్మల్, అక్టోబర్ 19, 2024
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో, జిల్లాలో ప్రసూతి మరణాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ప్రసూతి మరణాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ మహిళలకు నిర్వహించే పరీక్షల ద్వారా రక్తహీనత మరియు పోషకాహార లోపాలను గుర్తించి, అవసరమైన వారికి ఐరన్, కాల్షియం మాత్రలు అందించాలని సూచించారు.
పోషకాహారం పట్ల గర్భిణీలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడి టీచర్లతో కలిసి గర్భిణులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించాలన్నారు.
హైరిస్క్ కేసులు ఉన్న గర్భిణులను గుర్తించి, అవసరమైన చికిత్స అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, అన్ని ఆసుపత్రుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించాలన్నారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షణను కొనసాగించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ చర్యలు కొనసాగించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యాధికారులు సురేష్, సౌమ్య, ఇతర వైద్యులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.