తిరువణ్ణామలై (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
తమిళనాడులోని అరుణాచలేశ్వర గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ (మోక్ష మార్గం) గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతిచెందాడు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నాడు. దీన్ని మన తెలుగువారు మోక్ష మార్గం అని పిలుస్తారు.
గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తుంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఆయనకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












