నగరంలో జింక మాంసం కలకలం..
ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..
హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్ వద్ద అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. సోదాల్లో 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు బొలెరో వాహనం(AP09BT4716) సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
జింక మాంసం రవాణా చేస్తున్న మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసం, బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితులకు జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణి రక్షణకు సహకరించాలని సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు.