వీడు చేసేది వంట పని..
కానీ దేశంలో మంట పెట్టడమే అసలు పని..
పోలీసుల విచారణ లో తేలిన అసలు మ్యాటర్ ఇదే
ఎక్కడి పాకిస్తాన్…ఎక్కడి ధర్మవరం, రాయచోటి, విజయనగరం…
పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు మహ్మద్ నూర్. రాత్రయితే చాలు…పాకిస్తాన్లోని ఉగ్ర మూకలతో వాట్సప్ చాట్స్తో బిజీబిజీగా ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. చేసేది వంట పని…కానీ టెర్రర్ లింక్స్ అతగాడి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు పోలీసులు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలవరం రేపుతున్నాయి.
నూర్ కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే…
ధర్మవరం టు పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి.
ధర్మవరం కోట కాలనీలో నూర్ని అదుపులోకి తీసుకుంది IB.
దీంతో NIA కూడా రంగంలోకి దిగింది.
రహస్య ప్రదేశంలో నూర్ని విచారిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ.
అసలు ఈ నూర్ బ్యాక్గ్రౌండ్పై పోలీసులు ఇస్తున్న డీటెయిల్స్ ఏంటి?
ఇక ఏపీలో ఉగ్రజాడలు, నీడలు వరుసగా బయటపడుతుండడాన్ని ఎలా చూడాలి.
దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం.
మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత్పై ఉగ్రదాడులు చేయడమే దీని లక్ష్యం. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది ఈ ఉగ్ర మూక. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి….మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్లో అతనిపై వారెంట్లు ఉన్నాయ్. పాక్లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ, ధర్మవరం దాకా విస్తరించడం కలవవరం రేపుతోంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్కు జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. అయితే నూర్కు అమ్మాయిల పిచ్చి ఉంది కానీ, పాకిస్తాన్ పిచ్చి ఉందని తనకు తెలియదంటోంది అతగాడి భార్య. నూర్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందుకే అతడి నుంచి తాను విడిపోయానని చెబుతోంది ఆమె. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నూర్ మహ్మద్కు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతడిని కదిరి కోర్టులో హాజరు పరుస్తారు పోలీసులు.
ప్రశాంతంగా ఉండే ఏపీలో ఉగ్ర జాడలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ధర్మవరంలో ఉగ్ర నీడలు కనిపిస్తే…రెండు నెలల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఏడాది జూన్లో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రాయచోటిలో నిర్వహించిన సోదాల్లో…అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీళ్లు తమిళనాడులో చాలాచోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. మారుపేర్లతో రాయచోటిలో తలదాచుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. దీనికోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్కడి పాకిస్తాన్…ఎక్కడి ధర్మవరం, రాయచోటి, విజయనగరం…ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతాలను టెర్రరిస్టులు తమ షెల్టర్ జోన్లుగా మార్చుకున్నారా? ప్రశాంతంగా ఉండే ఏపీలో ఎవరూ తమను పసిగట్టలేరనే ధీమాతో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారా? ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రమూకల స్థావరాలను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన టైమ్ వచ్చింది.