బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్లో వైసీపీ..!
వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో సొమ్ములు చేసుకున్నారనేది తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించినప్పుడు కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో మద్యానికి సంబంధించి బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో వసూలు చేశారని తెలిసింది.
పెద్ద ఎత్తున ఈ విషయంలో సొమ్ములు చేసుకున్నారనేది సిట్ అధికారులు తాజాగా గుర్తించినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటివరకు డిస్టిలరీల కేటాయింపు, సీసాల లెక్క (కేసులు) ప్రకారం అక్రమాలు జరిగాయని సిట్ అధికారులు గుర్తించారు. వాటి ప్రకారమే లెక్కలు తేల్చారు. కొంతమందిని నిందితులుగా పేర్కొంటూ జైల్లోకి కూడా పంపించారు. వీరిలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా మాజీ ఐఏఎస్ అధికారి, జగన్కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిని జైళ్ళకు పంపించారు.
అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు మరుగున పడి ఉండడం, వాటిని తేల్చాలని ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నారాయణస్వామిని విచారించారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన సమాచారం బట్టి ప్రతి బొట్టుకు లెక్క గట్టి బార్ల నుంచి వసూలు చేశారట. బార్లలో సహజంగా సీసాల రూపంలో కాకుండా మందును విడిగా విక్రయిస్తారు. ఇలా విక్రయించిన మందుకు పెగ్గులు, 90ల రూపంలో అమ్మిన దానికి కమిషన్ల రూపంలో సొమ్ములు చేసుకున్నారు అన్నది నారాయణస్వామి చెబుతున్న మాట.
ఈ విషయంపై ఇప్పుడు సిట్ అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. ఇలా ఎవరు ప్రోత్సహించారు, ఈ విధంగా చేయమని ఎవరు ఆదేశించారనే విషయంపై ఆరాతీస్తున్నారు. అవసరమైతే బార్ల యాజమాన్యాలను కూడా నగరాల వారీగా కొంతమందిని ఎంపిక చేసి విచారించాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి కీలక నగరాల్లో మద్యం ఎక్కువగా విక్రయం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నారాయణస్వామి చెప్పిన సమాచారం బట్టి బొట్టు బొట్టుకు ఎంత కమిషన్ నొక్కారో లెక్క తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో వైసీపీకి మరింత ఉక్కపోత తప్పదన్న చర్చ సాగుతోంది