అమెరికా నుంచి భారత్ ఏమి నేర్చుకుంది?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకప్పుడు భారతదేశం వలేె వలస దేశం. నిజానికి ఇండియా వద్దామనుకొని అమెరికా వెళ్లిన కొలంబస్ ఇటలీకి చెందిన నావికుడు. సుమారు 1493లో అమెరికా చేరుకున్నాడు. అందుకే అక్కడ మొదటి వాసులను ఇండియన్స్ అనుకున్నారు. తరువాత ఫ్రెంచ్, బ్రిటీష్, స్పెయిన్ వంటి యూరప్ దేశాలకు చెందినవారు ఒక్కొక్కరూ అక్కడకు చేరుకున్నారు. అందుకే నేను ఒక సందర్భంలో ప్రపంచ పటం తీసుకొని అందులో ఉన్న అట్లాంటిక్ మహా సముద్రాన్ని తొలగించి అమెరికా ఖండంతో యూరప్ను సులువుగా కలప గలిగాను. నాకు అమెరికా ప్రత్యేకంగా కనబడలేదు. అది యూరప్ ఖండం కొనసాగింపుగానే ఉంది.
యూరప్లో ఉన్న పేర్లే అక్కడ పెట్టుకున్నారు. వలస వెళ్లిన మన తెలుగు వారు కమ్మవారిపల్లె, మాకివలస, అన్నట్లు, కేంబ్రిడ్జ్, బ్రైటన్ వంటి పట్టణాలు ఇప్పటికి అమెరికాలో ఉన్నాయి. ఇదే పరిస్థితి వేల సంవత్సరాల క్రితం భారత్లో ఉండేదనీ, చాలా జాతులు జంబూ ద్వీపానికి వచ్చాయని పురాణ కథలు ఉన్నాయి. కాని అమెరికా వెళ్లిన వందేళ్లకు డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటీష్ వలసవాదులు భారత్కు వచ్చారు. వాళ్లలో వాళ్లు కలహించుకొని చివరకు బ్రిటీష్ వారికి అంతా అప్పజెప్పి పశ్చిమలో పోర్చుగీసువారు, తూర్పు తీరంలో ఫ్రెంచి వారు చిన్న ముక్కలు చాలాకాలం ఉంచుకున్నా స్వాతంత్య్రానంతరం వారూ వెళ్లిపోయారు.
అమెరికాలో వ్యవసాయం చేయడానికి ఆఫ్రికా నుంచి నల్లవారిని బానిసలుగా తెచ్చుకున్నారు. భారత్లో ఆదివాసీలు మూలవాసులను సామాజికంగా బానిసలుగా చేసి అడవులను తొలగించి వ్యవసాయ యోగ్యంగా మార్చటానికి ఉపయోగించారు. ఈ వలస వాదం కొనసాగించినా, తరువాత వచ్చిన ఒక్కొక్క సమూహంతో భారత్ వైవిధ్యంగా మారింది. అమెరికాలో బ్రిటీష్ వారి పెత్తనం పెరగడం, బ్రిటీష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి 1789 లో స్వాతంత్య్రం, ప్రత్యేక రాజ్యాంగం అమెరికా ఏర్పాటు చేసుకుంది. భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల భాషల, మతాల ప్రజలు పోరాడి ఇండియా, పాకిస్థాన్గా విడిపోయి ప్రజాస్వామ్య రిపబ్లిక్లు ఏర్పాటు చేసుకున్నారు.
రెండిరటికి తేడా ఏమిటంటే అమెరికా రాజ్యాంగ నిర్మాణంలో వలసవాద తెల్లవారే రాజ్యాంగం రాసుకున్నారు. అక్కడఉన్న మొదటివాసులైన రెడ్ ఇండియన్స్ను గాని, నల్లవారినిగాని తరువాత వచ్చిన ఏ జాతులను కలుపుకోకుండా చిన్న రాజ్యాంగం 7 నిబంధనలతో రూపొందించుకున్నారు. భారతదేశం, పాకిస్థాన్ కూడా రాజ్యాంగ చట్టసభను ఏర్పాటు చేసి అన్ని సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించి డా॥అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రూపొందించుకుంది. ఇది 395 నిబంధనల గలది. అమెరికా, భారత్ రెండూ ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించటానికి పౌరులకు ఓటు హక్కు కల్పించి, ఎన్నికల ద్వారా రాజ్య నిర్వహణకు ప్రభుత్వాలను ఎన్నుకొనే ప్రక్రియను, రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, పౌరహక్కులు వంటివి కల్పించారు.
ఈ వ్యవస్థకు భారత్లో 75 సంవత్సరాలు. సుమారు దీనికి రెట్టింపు కాలం 135 ఏళ్లుగా అమెరికా ప్రజాస్వామ్యం పేరు మీద మనుగడ కొనసాగిస్తున్నది. అందుకే ఒక దేశం నుంచి ఇంకో దేశం ఏమి నేర్చుకున్నదో, ఇప్పుడు 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న మార్పులేమిటో తెలుసుకొని భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
భారతదేశ స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా ఇరుగు పొరుగున ఉన్న రష్యా, చైనా కంటే అమెరికాతో అంత దగ్గరగా లేదు. 1960 వరకు అమెరికాలో భారత్ వాణిజ్యం సుమారు 2 బిలియన్ల డాలర్లకే పరిమితం. అది కూడా అమెరికా నుంచి కొన్ని దిగుమతులు ద్వారా భారత్ నుంచి కొన్ని ఎగుమతుల ద్వారా జరిగిన కనీస వాణిజ్యం దీనికి కారణం లేకపోలేదు. పాకిస్థాన్ బాగ్దాద్ ఒప్పందం ద్వారా సెంటో పేరు మీద అమెరికాకు దగ్గరగా జరిగింది. నెహ్రూ ప్రభుత్వం ఇది గమనించి అలీన విధానానికి తెరతీసి 1960 నుంచి నాయకత్వ స్థాయికి ఎదిగి అమెరికా కంటికి కష్టంగా తయారయ్యింది. అయితే 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆహార కొరతతో 1966లో పబ్లిక్ లా 480 పియల్ 480 పేరు మీద అమెరికా నుంచి ఆహార వస్తువులు తక్కువ ధరలతో బాటు వ్యవసాయరంగ అభివృద్ధికి సాంకేతిక సహాయం అర్థించటం జరిగింది.
ఇప్పుడు ట్రంప్ పూర్తిగా రద్దు చేసిన యుఎస్ ఎయిడ్ ద్వారా అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి రావటం ప్రారంభించింది. అప్పటికి రష్యాతో తగాద సిద్ధాంత పరంగా పెరిగి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమయింది. చైనా, రష్యా పక్కన ఉన్న భారత్ కూడా అదే దారిలో పయనిస్తుందా అన్న అనుమానంతో అమెరికాకు చెందిన వందలాది పరిశోధకులు, ప్రభుత్వ ఫోర్డ్ ఫౌండేషన్ పేరు మీద పరిశోధనలు, రహస్య శోధనలు చేయటం మొదలుపెట్టారు. అప్పటి వరకు బ్రిటన్కు పరిశోధకులను పంపిస్తున్న ప్రభుత్వం అమెరికా ఇస్తున్న అనేక రకాలైన వెసులుబాటులతో అమెరికాకు పరిశోధకులను పంపించింది. దీని ద్వారా రెండు దేశాల బంధం ఆర్థికంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా పెరిగింది. బంధం బలపడిరది.
టెక్నాలజీ అన్నది మానవ నాగరికతలో భాగం. నిప్పు, విల్లు, బాణం కనిపెట్టినప్పటి నుంచీ అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నాడు. 20 వ శతాబ్దం చివరి నాటికి మొత్తం కంప్యూటర్లు, ఐటి రంగం మీద ఆధారపడటంతో 2000 సంవత్సరంలో వచ్చిన చిన్న అవాంతరం మూలంగా ఇంగ్లీషు తెలిసి ఉన్న పనివారు కావలసి రావడం, కంప్యూటర్ సేవ పేరుతో మనుషులను ఎగుమతి చేసే ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వచ్చాయి. భారత్ నుంచి ముఖ్యంగా ఆంధ్ర, కర్నాటక వంటి దక్షిణాది వారు ఎక్కువ మంది అమెరికా వెళ్లారు. ఈ రోజు అమెరికాలో అత్యధిక జీతాలు, సంపద పోగేసుకున్నవారు భారతీయులే. సంపదే కాదు మన సామాజిక తాత్విక చింతనకు మార్కెట్ ఉంది కాబట్టి ఎగుమతులు ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి ఒకరు ఎన్నిక అయిన వైస్ ప్రెసిడెంట్ సతీమణిగా దక్షిణాది వారు ముందున్నారు. అంటే భారత మూలాలు వదలకుండానే ట్రంప్తో జత కలిపే అవకాశం దొరికింది. గాని అక్కడ అమెరికా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకపోవటానికి పెట్టుబడి అన్నది దేశ ఎల్లలకు లోబడి ఉండే లక్షణాన్ని కోల్పోయి విశ్వవ్యాప్తి చెందింది. అక్కడ పెట్టే పెట్టుబడులు ఏ దేశానికైనా కావచ్చు, అక్కడి ట్రిలియనీర్లు ఆ దేశంలో ఉండాలనే లేదు. పైగా వ్యాపారం, వాణిజ్యం, సేవలు, ఫైనాన్స్ రంగాల విస్తరణ బాగా జరిగింది. దానికి ఆద్యులు అమెరికా పెట్టుబడిదార్లు, మేధా సంపన్నులే. అందుకే మార్క్స్ చెప్పిన కల్పిత పెట్టుబడి (ఫిక్షస్ కేపిటల్) ప్రపంచాన్ని కమ్మేసింది.
ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అమెరికా, ఇంగ్లండ్, జపాన్ దేశాల్లో ఉన్న ఫైనాన్స్ మార్కెట్లో ప్రపంచ దేశాల సంపద సగం కంటే ఎక్కువగా మార్పిడి జరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాను మళ్లీ గొప్పదిగా నిలబెడతాను అని ట్రంప్ అధికారంలోకి వచ్చి అనేక ప్రకటనలు చేశాడు. అందులో మొదట దఫా తీసుకున్న సలహాదారుల్లో మస్క్, భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి, శ్రీరామకృష్ణన్, క్రాష్పటేల్ వంటి సామాజిక మూలాలున్న తరగతి వారు ట్రంప్తో చేరారు. ట్రంప్ ప్రకటనల్లో ఇక నుంచి విదేశాల నుంచి భారత్తో సహా ఎవరూ అమెరికాలో అడుగుపెట్టవద్దన్నారు. ఆ మాట వివేకే అన్నాడు. మొదటి తరం మొత్తం అల్లుకున్న తరువాత భారత్ నుంచి ఇప్పుడిప్పుడే చదువుకొని తెలుగు పక్కనపెట్టి అమెరికా కలల్లో ఊగిపోయే రెండో తరానికి అడ్డుకట్ట వేశారు. గతంలో అమెరికా పెట్టుబడిదారీ విధానం ద్వారానే స్వేచ్ఛా వాణిజ్యంతోనే సంపద పెరుగుతుంది.
భారత్ బాగుపడుతుందని పరిశోధనా గ్రంథాలు, ఇండియాలో ప్రభుత్వంతో ఉంటూ ప్రపంచ బ్యాంక్ ఎసైన్మెంట్ పేరుతో మమ అనిపించుకున్నా ఆర్థిక, బ్యాంక్ నిపుణులు తయారుచేసిన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. వాషింగ్టన్ కన్సస్ అంటే వాషింగ్టన్లో ఉండే ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ ఫెడరల్ రిజర్వు కలిసి రూపొందించిన అమెరికా ఆర్థిక విస్తరణ అనే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. భారత్లో షేర్ మార్కెట్ పెరిగింది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థలు మూతబడ్డాయి. యూపీఏతో వామపక్షాలు లేకుంటే మోదీ వచ్చేనాటికి మొత్తం కార్పొరేటీకరణ జరిగేది. అలా జరగలేదు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా నుంచి భారత్ చాలా విషయాలు నేర్చుకుంది.
ట్రంప్ వచ్చిన వెంటనే మస్క్కు చెప్పి ప్రభుత్వంతో పని చేస్తున్న వారిని తొలగించాడు. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ (వైవిధ్యం, సమానత్వం, కలుపుకోవటం) అన్న ప్రజాస్వామ్య రాజ్యాంగం అంగీకరించిన ఉన్నత ఆశయాలతో ఏర్పడిన వ్యవస్థను రద్దు చేశాడు. నల్లవారికి గాని ఇంకెవరికీ రిజర్వేషన్లు ఉండవు. అంతా డబ్బుతో కూడుకున్న మెరిటే ఆధారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తొలగిపోయి ఇవ్వవలసిన బకాయిలు ఎగ్గొట్టే ప్రయత్నం. వివిధ దేశాల్లో సేవలందిస్తున్న యూఎస్ ఎయిడ్ రద్దు చేశాడు.
విద్యారంగానికి ఇచ్చే నిధులు తగ్గించాడు. కొలంబియా, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విద్య, పరిశోధనలకు గ్రాంట్ తొలగించాడు. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం కోసం గాట్ తరువాత డబ్ల్యూటీవోను ఏర్పాటుచేసి ప్రపంచ వాణిజ్యాన్ని పెంచాలన్న ఆలోచనలకు తిలోదకాలిచ్చి సుంకాలు, టారిఫ్లు వేస్తానంటూ చైనాపై 34 శాతం, భారత్పై 26 శాతం టారిఫ్ను పెంచాడు.
ట్రంప్ ప్రకటించిన కొన్ని విధానాలను భారత్ గత కొంతకాలంగా ప్రవేశపెట్టి ఆచరిస్తోంది. విద్యారంగాన్ని ముఖ్యంగా ఉన్నత విద్యను ప్రైవేటీకరించి 3 లక్షల మంది కులీనులను 90 వేల కోట్లు బ్యాంక్ అప్పుతో అమెరికాలో చదివిస్తున్నది ఇప్పటి ప్రభుత్వం. ఆ తరగతులకు ఈ దేశంతో పనిలేదు. విశ్వ మానవులు, విశ్వ గురువులు ఇక్కడ ఉండే పేద, మధ్య తరగతి అలగా జనానికి ఐదుకిలోల బియ్యం చాలు. ఎన్నికలప్పుడు డబ్బులిస్తే ఓట్లేస్తారు. ఆ పనిని 3.5 లక్షల కోట్లరూపాయల డార్క్మనీతో ట్రంపు గెలిచినట్లు వార్తలు. అంటే భారత్ గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం మోనిటైజేషన్కు గురయింది.
నల్లవారు, బహుజనులు ఒకేలాంటి తరగతి జనం వారిని పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు. రాజ్యాంగం, చట్టాలు ఉన్నా వాటిని నిర్వహించే వారు తమ భావజాలంతో ఉంటే సమస్యలు ఉండవని గతంలో ఎన్నికైనప్పుడే ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జిలను నియమించాడు. దాన్ని మనం ఇక్కడ అమలు చెయ్యవచ్చు. చిక్కంతా ట్రంప్ వేసిన సుంకాల మూలంగా జరిగే నష్టం. భారత్ అమెరికా వాణిజ్యం సుమారు 130 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ఇందులో సుమారు 78 బిలియన్ల డాలర్లు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఉన్నాయి. అందులో ఇంజినీరింగ్ వస్తువులు18 బిలియన్లు, ఎలక్ట్రానిక్స్ 10 బిలియన్లు, జెమ్స్ 10 బిలియన్లు, పెట్రోల్ సంబంధిత ఎగుమతులు 6 బిలియన్ల డాలర్లు. ఇందులో ఎక్కువ వస్తువులు గుజరాత్ ఆధారిత జెమ్స్, రిలయెన్స్ వంటి సంస్థలవి ఉన్నాయి.
ఫార్మా వస్తువుల ఎగుమతి ఉన్నా ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లలేదు. అయితే భారత్లో అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులు 4.78 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. పరోక్షంగా ఎంత ఉందో తెలియదు. ముఖ్యంగా ఈ పెట్టుబడులు ఫైనాన్స్, వాణిజ్యం, టెలికం, సాఫ్ట్వేర్ రంగాలలో ఉంది. బహిరంగంగా తెలియని భారత్ పెట్టుబడులు అమెరికాలో చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ కల్పిత పెట్టుబడి ద్వారా భారత జాతీయాదాయానికి ఒకటిన్నర రెట్లు ఉన్న ఫైనాన్స్ కేపిటల్లో చాలా లావాదేవీలు అమెరికా సంబంధిత కార్పొరేట్ల ద్వారానే జరుగుతాయి.
అంటే భారత్ ఇప్పుడు పూర్తిగా అమెరికా అనుకూల సామ్రాజ్యవాద విస్తరణలో భాగమైపోయిందా? అన్నది అంచనా వెయ్యాలి. అది భారత్ కార్పొరేట్ సంస్థలు ఏ మేరకు పాదుకొని పోయాయో, ఎన్ని విదేశీ సంస్థలు మన దేశంలో లావాదేవీలు జరుపుతున్నాయో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. రోజుకు పన్నెండు గంటలు పని చేయండి అంటే నారాయణమూర్తిగారిని పెట్టుబడిదారుడు, సామ్రాజ్యవాద తాబేదారు అనలేము.
ఇప్పుడున్న ట్రంప్ ఆర్థిక విధానాలు అన్నవి ప్రపంచ పెట్టుబడిదారీ విధానాలుగానే చూడాలి. అవి ఫైనాన్స్ కేపిటల్ విస్తరణ ద్వారా, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు` యుద్ధాలు కొనసాగించటం ద్వారా జరిగితే సామాజిక రంగంలో కనీసం అమెరికా బడ్జెట్ను కూడా అనుకరించలేని దుర్బలమైన విధానాలు భారత్లో అమలు జరుగుతున్నాయి. కారణం అమెరికా 2024 బడ్జెట్ 6.27 లక్షల డాలర్లు. అందులో సోషల్ సెక్యూరిటీకి 1.21 లక్షల డాలర్లు, మెడికేర్ హెల్త్ కేర్ కలిపి 1.6 లక్షల డాలర్లు, విద్యపై 677 బిలియన్లు ఖర్చు చేస్తున్నారు. అంటే 50.1 శాతం ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అది. మిలిటరీపై 12.2 శాతం 767 బిలియన్లు అమెరికా ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్లో చూపినా యధేచ్చగా ఎంతయినా ఖర్చు చేసుకునే వెసులుబాటు అధ్యక్షునికి ఉంది. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగంలో లేనిది అమెరికా రాజ్యాంగంలో యుద్ధం ప్రకటించే నిబంధన ఉంది.
ముఖ్యంగా మెడికేర్, హెల్త్కేర్ పేరుమీద ఇచ్చే బడ్జెట్ అమెరికాలో ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి చెందిన బీమా కంపెనీలకే చెందుతుంది. మన దేశంలో సామాజిక రంగాలపై 26 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. భవిష్యత్లో చైనాను కాదని భారత్లోకే పెట్టుబడులు వరద వచ్చేస్తుంది అనుకొనే దేశ భక్తులు, ట్రంప్ ప్రకటనలతో అత్యంత ప్రభావశీలమైనది విదేశాల్లో ఉన్న యాపిల్తో సహా అందరూ అమెరికా రావాలని, వస్తే మీపై ఎటువంటి సుంకాలు ఉండవు అన్నాడు. అందుచేత భారతదేశం అమెరికా నుంచి కాకుండా మన మూలాల నుంచి మన రాజ్యాంగ విలువల నుంచే మన భవిష్యత్ వెతుక్కోవాలి