ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు: వరుణ్ అంగీకారంతో రూ.11 కోట్ల నగదు స్వాధీనం
హైదరాబాద్, జూలై 29 (M4News):
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఏ40 నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన కీలక సమాచారంతో హైదరాబాద్లోని శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్హౌస్లో S.I.T. అధికారులు సోమవారం భారీ దాడులు నిర్వహించారు.
దాడుల సందర్భంగా మొత్తం రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరుణ్ అంగీకారం మేరకు, అతను మరియు చాణక్య కలిసి ఏ1 నిందితుడైన రాజ్కేసిరెడ్డి ఆదేశాల మేరకు నగదును 12 పెట్టెల్లో దాచి ఉంచినట్లు వెల్లడించారు. ఈ మొత్తం 2024 జూన్లో దాచినట్టు సిట్ అధికారులు తెలిపారు.
అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ దాడుల సందర్భంగా భారీగా నగదు బయటపడటంతో లిక్కర్ స్కాంలో నూతన మలుపు తిరిగింది. కేసు సూత్రధారులపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితుల్ని విచారిస్తున్నట్టు సమాచారం.
పరిపాలనా వ్యవస్థను ప్రభావితం చేసిన భారీ అవినీతి వ్యవహారంగా లిక్కర్ స్కాం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.