- టెట్ ఫలితాలు విడుదల – పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% ఉత్తీర్ణత
- గతేడాదితో పోలిస్తే ఈసారి పాస్ శాతం తగ్గుదల
- టెట్ పరీక్షలకు 2.75 లక్షల మంది దరఖాస్తు – 1.35 లక్షల మంది హాజరు
- ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన విద్యాశాఖ
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది టెట్ ఫలితాలతో పోలిస్తే పాస్ శాతం ఈసారి తగ్గింది. జనవరి 2 నుండి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.35 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) 2025 ఫలితాలు బుధవారం సచివాలయంలో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి విడుదల చేశారు. జనవరి 2 నుండి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, 1,35,802 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 83,711 మంది ఉత్తీర్ణులయ్యారు.
పరీక్ష ఫలితాల ప్రకారం, పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది జూన్లో విడుదలైన టెట్ ఫలితాలతో పోలిస్తే, ఈసారి పాస్ శాతం తగ్గడం గమనార్హం. 2024లో పేపర్ 1లో 67.13% మంది పాస్ కాగా, ఈసారి అది 59.48%కు తగ్గింది. పేపర్ 2లో 34.18% మంది ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 31.21% మాత్రమే క్వాలిఫై అయ్యారు.
విభాగాల వారీగా పాస్ శాతం:
- పేపర్ 1: 69,476 మంది హాజరై 41,327 మంది ఉత్తీర్ణులయ్యారు.
- పేపర్ 2: 1,35,802 మంది హాజరై 42,384 మంది అర్హత సాధించారు.
- మ్యాథ్స్ & సైన్స్: 69,390 మంది రాసి 23,755 మంది పాస్
- సోషల్ సైన్స్: 66,412 మంది రాసి 18,629 మంది ఉత్తీర్ణత
ఫలితాలు అధికారిక వెబ్సైట్ www.schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయి అని అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను టెట్ కన్వీనర్ రమేశ్, విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.