న్యూ ఢిల్లీ: అక్టోబర్ 07
దసరా, దీపావళి పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందిన నేపథ్యంలో ఢిల్లీ నిఘా విభాగం అధికారులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు.
భారీ దాడులకు సన్నాహాలు చేస్తున్న ఉగ్రవాదులు మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కుట్రలను అమలు చేసే యత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనితో, ఢిల్లీ పోలీసులు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్, తనిఖీలను కఠినతరం చేయాలని ఆదేశాలు అందించారు.
ఇంతటితోనే కాదు, విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునే వ్యూహాలతో ఉగ్రవాదులు ముందుకు రావచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అంతేకాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో కొన్ని ఉగ్రముఠాలు పోస్టింగ్లు పెడుతున్నట్లు కూడా గుర్తించారు. కొన్ని విదేశీ ఎంబసీలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ నగరమంతటా హై అలర్ట్ కొనసాగుతుండగా, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.