అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్ 04: అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో సైతం పగుళ్లు వచ్చాయన్నారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్చారని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని వివరించారు. వీటిలో ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలున్నాయని తేలిందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టల నిర్మాణంపై విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో స్పష్టం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు సహా అనేక మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించిందని తెలిపారు.
16 నెలల విచారణ అనంతరం 665పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారని చెప్పారు. ఈ కమిషన్ రిపోర్ట్పై అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేశామన్నారు. ఊరు,పేరుతోపాటు చివరకు అంచనాలు సైతం మార్చి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిందని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆ క్రమంలో అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు సైతం తీసుకుంటామని పేర్కొన్నారు.
అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రజా ప్రతినిధులకు ఈ కమిషన్ నివేదిక అందజేస్తామన్నారు. అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్ప వచ్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.