వేడుకల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మధుయాష్కిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధుయాష్కిని ఎల్బీనగర్ నుండి తరిమికొట్టే వరకు తన పోరాటం ఆగదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
*వైయస్సార్ వర్ధంతి వేడుకల్లో సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు*
*కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని ఎల్బీనగర్ నుండి తరిమికొట్టేంత వరకు నా పోరాటం ఆగదు: జక్కిడి ప్రభాకర్ రెడ్డి*
ఎల్బీనగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కరుడుగట్టిన కాంగ్రెస్వాది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్లోని వైఎస్సార్ చౌరస్తాలో వారి విగ్రహానికి సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల పక్షపాతిగా నిలిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
వైఎస్సార్ లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని తాను కూడా కాంగ్రెస్ పార్టీలో గత 40 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పార్టీ సిద్ధాంతాల కోసం కరుడుగట్టిన కాంగ్రెస్వాదిగా పనిచేశానని తెలిపారు.
ఎల్బీనగర్ లో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు విషయంలో మధుయాష్కీ అడ్డంకులు సృష్టిస్తే అడ్డంకులను అధిగమించి తాను విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు.ఈ విషయంలో మధుయాష్కీ తనపై వ్యక్తిగత కక్ష్యపెంచుకుని కల్పిత ఆడియోలతో కుట్రలు చేసి, పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చి తనను సస్పెన్షన్కు గురిచేశారని ఆరోపించారు.
మధుయాష్కి, ఆయన అనుచరులు ఎల్బీనగర్లో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కనీసం డాక్టర్ హోదా కూడా లేని మధుయాష్కి అనుచరుడు నాలుగు ఆసుపత్రులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎల్బీనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రులను సిండికేట్గా మార్చి రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.వీటన్నింటిపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సరైన సమయంలో వీటన్నింటిపై ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు వస్తాయని మధుయాష్కి తనకు తాను ప్రచారం చేసుకుంటూ పూర్తిగా ఊహాలోకంలో మునిగిపోయి ఒక మానసిక రోగిగా తయారయ్యాయరని ఎద్దేవా చేశారు.ప్రజాక్షేత్రంలో బలం లేని మధుయాష్కీకి పదవులు ఇస్తే ఆయనకు వ్యక్తిగత లాభమే తప్ప కాంగ్రెస్ పార్టీ కి ఏమి లాభముండదని అన్నారు.












