అడెల్లి అమ్మవారికి చేనేత పట్టు చీర సమర్పించిన పద్మశాలీలు
మనోరంజని ప్రతినిధి
సారంగాపూర్, సెప్టెంబర్ 28
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారికి ఆదివారం గంగనీళ్ల జాతర సందర్భంగా పద్మశాలి వంశస్థులు పట్టు చీరను సమర్పించారు. ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి “పుట్టింటి సారె”గా చేనేత పట్టు వస్త్రాన్ని సమర్పించగా ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారిని ఆరాధిస్తూ అందరికీ సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ—అడెల్లి శ్రీ మహా పోచమ్మను పద్మశాలీల ఆడబిడ్డగా భావించి ప్రతి ఏటా ఆనవాయితీగా చేనేత పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లే, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారికంగా జాతర సందర్భంగా మొదటగా అమ్మవారికి పద్మశాలి వంశస్థులు చేనేత వస్త్రాలు సమర్పించేలా జి.ఓ.ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.