వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు మహిళా పోలీసు అధికారులు లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీమతి బి. సరోజ, సబ్-ఇన్స్పెక్టర్ శ్రీమతి హెచ్. రాణిలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో ఫిర్యాదిదారునికి మరియు అతని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడానికి ఇన్స్పెక్టర్ సరోజ, ఎస్సై రాణి కలిసి రూ.60,000 లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదిదారుడి విజ్ఞప్తి మేరకు ఈ మొత్తం రూ.40,000కు తగ్గించబడింది.
ఈ క్రమంలో, మార్చి 23న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిదారుడు ఎస్సై రాణికి రూ.20,000 లంచం చెల్లించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ నిందితులు ఒత్తిడి చేయడంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందిన వెంటనే, ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి, నిందితులపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.












