తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన పిడమర్తి నాగరాజుకు ఉద్యోగం ఇప్పించేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని శాసనమండలి సభ్యులు కేతవత్ శంకర్ నాయక్ హామీ ఇచ్చారు. మిర్యాలగూడలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో, వేగంగా వెళుతున్న రైలు ఎదురుగా వెళ్లి రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయిన పిడమర్తి నాగరాజుకు ఉద్యోగం కల్పించడంలో నాటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనమని, నాగరాజు కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోందని ఆయన తెలిపారు.
నాగరాజుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విషయంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలని, వారికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పిడమర్తి నాగరాజును శాలువా, పూలమాల, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు నాగరాజుకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ రాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బట్టు వెంకటేశ్వర్లు, టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతికుమార్, మాల మహానాడు నాయకులు అభినవ్, నీలకంఠ నాయక్, జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








