నమో నారసింహా! కన్నుల పండువగా సాగిన రథోత్సవం
గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం
భీంగల్ మండలంలోని పవిత్ర లింబాద్రిగుట్టపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో కార్తీక మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా కార్తీక పౌర్ణమి రథోత్సవం బుధవారం నాడు భక్తి పూర్వకంగా, వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల “గోవింద… గోవింద…” నామస్మరణతో నింబాచలం మార్మోగిపోయింది.
బ్రహ్మోత్సవాల ప్రధాన భాగమైన రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. రథప్రతిష్ఠ, తత్వన్యాస, హోమాలు, పూర్ణాహుతి, అష్టదిక్కులకు బలి ప్రధానంతో శాస్త్రోక్తంగా కార్యక్రమం సాగింది. స్వర్ణాలంకారంతో మెరిసిన రథంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠించి, భక్తుల మంగళహారతుల మధ్య రథయాత్ర ప్రారంభమైంది.
భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగుతూ “జయ గోవింద” అంటూ గగనమంత నినాదాలతో క్షేత్రాన్ని మార్మోగించారు. రథంపై ఆశీనులైన శ్రీ కేశవుని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
🚩 భక్తుల రద్దీతో నింబాచలం కిటకిట
రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు గర్భాలయ దర్శనానికి బారులు తీశారు. పుష్కరిణి వీధుల నుండి మెట్ల మార్గం గుండా గర్భాలయం వరకు రద్దీగా మారింది. అర్చకులు స్వామివారికి స్వర్ణాలంకరణ చేసి భక్తులకందరికీ దర్శనం కల్పించారు. దూరప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి కరుణను పొందేందుకు క్షేత్రానికి తరలివచ్చారు.
👮♂️ పోలీసుల బందోబస్తు పకడ్బందీగా
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల క్రమబద్ధీకరణ నుండి రథయాత్ర ముగిసే వరకు పర్యవేక్షణ చేశారు.
🙏 రథోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు
లింబాద్రి క్షేత్రంలో జరిగిన ఈ మహోత్సవానికి ప్రాంతీయ ప్రముఖులు, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు.