*అదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం*
*భయాందోళనలో ఏజెన్సీ గ్రామాలు!*
మనోరంజని టేపుడు టైమ్స్ ప్రతినిధి
అదిలాబాద్ జిల్లా అక్టోబర్ 09
అదిలాబాద్ జిల్లాబోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల వ్యవధిలో చిరుత పులి పశువుల పై దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి నిగిని అటవీ ప్రాంత సమీపంలో మేతమేస్తున్న ఆవులపై చిరుత పులి దాడి చేసింది,
అడవిలో చిరుత పులి సంచారం వల్ల సమీప గ్రామాల ప్రజలు, రైతులు, భయాందోళనకు గురవుతున్నారు పంట పొలాల్లోకి వెళ్లడానికి రైతులు,వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు జంకుతున్నారు.
నిగిని అటవీ ప్రాంత సమీపంలో దుర్వ గంగారాంకు చెందిన ఆవు, రేండ్లపల్లి గ్రామానికి చెందిన సడుముకి లక్ష్మణ్కు చెందిన ఆవులు మేత మేస్తుండగా చిరుత పులి దాడిలో మృతి చెందాయి.
స్థానిక రైతులు మాట్లాడుతూ.. పంట చేతికి వస్తున్న తరుణంలో చిరుతలు సంచరిస్తుండడం తో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని, వ్యవసాయ కూలీలు కూడా వెనకడుగు వేస్తున్నారని అటవీ సమీప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు నీరు పుష్కలంగా లభిస్తుండడంతో వన్య ప్రాణులకు ఆవాసాలుగా మారాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే పులి దాడిలో మృతి చెందిన పశువుల యజమానులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం వచ్చేలా చూస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అధికారులు అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అటవీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.