కార్తీక పురాణము – 2
ఆశ్రిత్ ఆలయ దర్శన యాత్ర
(తీర్థయాత్రల కొరకు సంప్రదించండి 9848896048 )
అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!!
ఓ రాజా! కార్తీకమహాత్మ్యము విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించు వాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసిన యెడల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును అనుటలో సందేహములేదు.
దయచేసి షేర్ చేయగలరు
కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ ఆరు ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవలము ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్తము చేయవలెను. అందుకు
శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించని యెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాక నరకములోను, రౌరవ నరకములోను బాధలను పొందుతారు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమును పొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథ చెపుతాను. ఇది విన్నవారికి, చెప్పువారికి పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బాగుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్తుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారంగుడు. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అని నామము. మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు అనురాగముతో ఉండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీ భర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను వినలేదు. ఇట్లుండగా ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులై వచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆ వ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడి, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. యముని ఆజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును కౌగలింప చేసిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమ, చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్కశ తన పితృ పితామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవార దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్రమండలమును చూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనముచేత కుక్కకు పూర్వజన్మ స్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమి చేసితివి? రక్షింపుమనుచున్నావని అడిగిన ఆయనతో కుక్క బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈ విధి పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జన్మస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పు విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జన్మస్మృతి గలిగినదని చెప్పెను. ఆ మాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈ కుక్క జన్మనుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను ధరించి కైలాసము చేరుకొనెను. కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయసమాప్తః
ఆశ్రిత్ ఆలయ దర్శన యాత్ర
(తీర్థయాత్రల కొరకు సంప్రదించండి 9848896048