పోతంగల్ పంచాయతీ ఎదుట ముదిరాజుల ధర్నా: కార్యదర్శి తీరుపై మండిపాటు
పోతంగల్, జూలై 29 (మనోరంజని ప్రతినిధి) – నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ముదిరాజ్ సంఘ సభ్యులు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ తీరును ఖండిస్తూ, ఆయనను బహిరంగంగా నిలదీశారు.
వారికీ చెందిన పాత షెడ్డు పక్కన కొత్తగా రేకుల షెడ్డు నిర్మించేందుకు ప్రయత్నించిన సమయంలో, సెక్రటరీ చంద్రకాంత్ తన సిబ్బందితో వచ్చి పైపులను ధ్వంసం చేయడంతో ఈ వివాదం తలెత్తింది. ఈ చర్య ముదిరాజులకు అవమానంగా మారిందని వారు మండిపడ్డారు.
“ఎలాంటి నోటీసు లేకుండా షెడ్డు పైపులు తొలగించడం పూర్తిగా అన్యాయమైంది,” అంటూ సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్న స్థలంలోనే షెడ్డు వేయబోతున్నామని, ఎలాంటి కొత్త ఆక్రమణ కూడా చేయలేదని వారు స్పష్టం చేశారు.
అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శిని ప్రత్యక్షంగా కలిసి, “ఎందుకు మమ్మల్ని అవమానపరిచారు?” అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కార్యదర్శి చంద్రకాంత్ మాట్లాడుతూ, తాను పై అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే పని చేశానని చెప్పారు. షెడ్డు కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలని సూచించారు. పై అధికారులు అంగీకరిస్తే ఎవ్వరూ అడ్డుపడబోరని హామీ ఇచ్చారు.
ఈ హామీతో ముదిరాజులు శాంతించి, తమ వినతిపత్రాన్ని కార్యదర్శికి అందజేశారు. అయితే, సంఘ సభ్యులు చివరిగా హెచ్చరిస్తూ “ముదిరాజుల హక్కుల విషయంలో ఎవరు జోక్యం చేస్తే సహించం” అన్నారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో ముదిరాజ్ సంఘానికి చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.