రంగులలో ‘భూ దర్శిని’-దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే
ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ
ములుగు జిల్లా గౌడ్
********
రాష్ట్రంలోని భూముల వివరాలను మరింత సులభంగా గుర్తించే అవకాశం రాబోతోంది. కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్ల్యాండ్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్ల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు.
‘భూ దర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్ల్యాండ్లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు (1,27,547.856 చదరపు కిలోమీటర్లు) ఉండగా, వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే (34,984.18 చ.కి.మీ. మేర) పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఆవి ఆటోమేటిగ్గా వెబ్ల్యాండ్లోకి చేరుతున్నాయి.
5 రంగులు: రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాపుల్లో ఉన్న భూములను 5 వేర్వేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది. రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా దృశ్యరూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. వెబ్ల్యాండ్లో భూముల వద్ద క్లిక్ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ విధానం క్రయ, విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది
కొత్త విధానంతో ఉపయోగాలు ఇవీ
హద్దులు కచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు.
విపత్తుల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు, చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వంటివి గుర్తించవచ్చు.
పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లోని పంటల సాగు, భూముల స్వభావం తెలుసుకోవచ్చు.
గ్రీన్ ఎనర్జీలో భాగంగా విద్యుత్తు ఉత్పాదనకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పట్టాదారు పుస్తకాల్లో ‘క్యూఆర్’ కోడ్: రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. పుస్తకాల్లో ‘క్యూఆర్’ కోడ్ సాయంతో భూముల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ‘క్యూఆర్’ కోడ్లోని నావిగేషన్ సాయంతో భూముల వద్దకు వెళ్లే సదుపాయం కూడా ఉంటుంది.
గత వైఎస్సార్సీపీ పాలనలో జగన్ ప్రచారానికి వీలుగా ఆయన ఫొటోలతో పట్టాదారు పుస్తకాలను ముద్రించారు.
కూటమి ప్రభుత్వం వాటిని తొలగించి పూర్వ విధానంలో మాదిరిగానే రాజముద్రతో కొత్త పుస్తకాలను ముద్రిస్తోంది.
భూమి వివరం… రంగు
ప్రభుత్వ భూములు, ఎరుపు
ప్రైవేట్ భూములు, ఆకుపచ్చ
గ్రామ కంఠ భూములు, ఊదా
నీటి కుంటలు/ చెరువులు,నీలం
రహదారులు, పసుపు