- నీటిపారుదలశాఖలో 1597 లష్కర్లు, 281 హెల్పర్లకు నియామకాలు
- గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి
- ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600
నిరక్షరాస్యులకూ కొలువుల అవకాశంతో నీటిపారుదలశాఖ కొత్త నియామకాలను చేపట్టనుంది. ముఖ్యంగా కాలువలు, డ్యామ్ల పర్యవేక్షణ కోసం 1597 లష్కర్లు, 281 హెల్పర్లను నియమించనుంది. 45 ఏళ్ల లోపు శారీరకదారుడ్యం కలిగిన వారిని నియమించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియను సమన్వయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ అక్టోబర్ 26: నీటిపారుదలశాఖలో భారీ నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా కాలువలు, డ్యామ్లు, రిజర్వాయర్ల పర్యవేక్షణ కోసం 1597 లష్కర్లు, గేట్ల ఆపరేషన్ కోసం 281 హెల్పర్లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు కొలువు కల్పించే ప్రయత్నంగా భావించవచ్చు. నియమించబోయే సిబ్బంది 45 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి శారీరక దారుడ్యం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు విద్యార్హత అవసరం లేకుండా నెలకు రూ.15600 గౌరవ వేతనం అందజేయనున్నారు.
వానాకాలం వంటి సమయాల్లో ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడం, ఎక్కడైనా కాలువలకు ఇబ్బంది కలిగిన చోట వేగంగా స్పందించడం లష్కర్ల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలకు కాలువలపై పర్యవేక్షణ లోపం వల్ల దెబ్బతిన్న కాలువలు, చెరువులను రిపేర్ చేయడం, చెట్లు, చెదల పూడిక తొలగించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి మరియు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన తరువాత ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈఎన్సీ/సీఈ ఛైర్మన్గా, ఎస్ఈ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. సమీప గ్రామాల్లో నివాసం ఉన్నవారికే ఈ అవకాశాలు కల్పించి, వారి గ్రామాల్లోనే పని చేసే సదుపాయాన్ని కల్పించనుంది.