విజృంభిస్తున్న డెంగీ.. కుత్బుల్లాపూర్లో పెరుగుతున్న కేసులు
– జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టాలు తప్పవు
హైదరాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మలేరియా, టైఫాయిడ్తో పాటు మరికొన్ని విషజ్వరాలు కూడా వస్తాయి. ఇందులో ప్రధానంగా డెంగీ ప్రమాదకరమైందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రారంభంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే మేలని, వ్యాధి తీవ్రతరమైన తర్వాత మేలుకుంటే కష్టాలు తప్పవని, వ్యాధి బారినపడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డినగర్, సుభా ్షనగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లు ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, నీటి నిల్వల కారణంగా పెరుగుతున్న దోమల నివారణకు ఎంటమాలజీ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో డెంగీ వాధి విజృంభిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. దత్తాత్రేయనగర్లో పదేళ్ల బాలుడు, వెంకటేశ్వరనగర్లో ఓ మహిళ(50), భాగ్యలక్ష్మికాలనీలో ఏడేళ్ల రాధేష్ మాధవన్, శ్రీకృష్ణనగర్కు చెందిన సుధాదేవి(35)లు డెంగీ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డెంగీ వచ్చిన ప్రాంతాల్లో చర్యలేవి ?
డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలి. కానీ డెంగీ కేసులు నమోదైన దత్తాత్రేయనగర్, భాగ్యలక్ష్మికాలనీ, శ్రీకృష్ణానగర్, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
ప్రతీ ఇంటి సమీపంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఖాళీ టైర్లు, కూలర్లు, కొబ్బరి బొండాలు, కుండలు, వాటర్ బాటిళ్లు ఉంటే అందులో వర్షం నీరు చేరి లార్వా వృద్ధి చెందుతుంది. లార్వా పుట్టిన మూడు, నాలుగు రోజులకే ఏడిస్ దోమగా మారి కాటేస్తుంది. తక్షణమే నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో పండ్లు, కూరగాయలు కుళ్లిపోతే వాటిపై దోమలు పెరిగే అవకాశముంది. అదే సమయంలో దోమల నివారణ మందును ఉపయోగించుకోవాలి.