హైదరాబాద్, జులై 10
దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీమణి శాంతకుమారి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ వార్త సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీమణి శాంతకుమారి, గురువారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె, కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం శాంతకుమారి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1958 మే 15న శోభన్ బాబు, శాంతకుమారి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెలుగు సినీ రంగంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలతో రూపొందించిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నారు. చివరి శ్వాస వరకు హీరోగానే నటిస్తానని చెప్పిన శోభన్ బాబు, పలు చిత్రాల అవకాశాలను సైతం వదులుకున్నారు. 2008లో గుండెపోటుతో శోభన్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే.












