మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
ఉపాధ్యాయులకు అల్పాహారం, భోజనం అందించాలనే కేబినెట్ నిర్ణయాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు అల్పాహారం, భోజనం అందించాలనే కేబినెట్ నిర్ణయం హాస్యాస్పదమని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే జయకృష్ణ విమర్శించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సంక్షేమంపై ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే, కాలయాపన చేయకుండా 6 డీఏలను, నూతన పీఆర్సీని ఎందుకు ప్రకటించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెండింగ్లో ఉన్న 6 డీఏలు, పీఆర్సీ వంటి వాటిని అడిగినప్పుడు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్రకటించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని అన్నారు.
ఈ పథకం వల్ల అయ్యే నిధులతో మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, పిల్లలకు ఇచ్చే స్లాబ్ రేట్లను పెంచి మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపరచాలని డీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.











