సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: అక్టోబర్ 07
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 42,000 మంది కార్మికులకు లాభాల్లో భాగంగా బోనస్ చెక్కులు పంపిణీ వేడుక హైదరాబాద్లోని ప్రజా భవన్లో నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులు తమ బోనస్ చెక్కులు అందుకున్నారు.
ఈ ఏడాది సింగరేణికి రూ. 2412 కోట్ల లాభం రావడంతో, అందులో 33 శాతం అంటే రూ. 796 కోట్లు బోనస్గా కార్మికులకు కేటాయించారు. ప్రతి కార్మికునికి రూ. 1.90 లక్షలు బోనస్గా అందించారు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5 వేల బోనస్ ప్రకటించారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి, శ్రమదోపిడీని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, సింగరేణిలో పని చేసే కార్మికులకు వేతనాలు పెంచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. వీటితో పాటు కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు, పెన్షన్ను కూడా రూ. 10 లక్షలకు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి.