తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న వాసవి మాత జయంతిని అధికారికంగా పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు, రైస్ మిల్లర్లు, వ్యాపార, వాణిజ్య రంగాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) ను రైస్ మిల్లర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఈనెల 26న (ఆదివారం) జరగనున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
తమ ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే బి.ఎల్.ఆర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ నిర్ణయంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్, ప్రముఖ రైస్ మిల్లర్లు కర్నాటి లక్ష్మీనారాయణ, రాజేందర్, తెడ్ల జహార్ బాబు, నాగేందర్, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం సంఘం సభ్యులలో నూతన ఉత్తేజాన్ని నింపింది.












