కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీఆర్ఎస్ నేతలు
పోచారం వ్యాఖ్యలకు నిరసనగా పత్రికా సమావేశం
మనోరంజని తెలుగు టైమ్స్ కోటగిరి (నిజాంబాద్ జిల్లా) ప్రతినిధి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై నిజాంబాద్ ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.నిజాంబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ ఇంటి ప్రాంగణంలో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడారు.
బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన సభలో పోచారం భాస్కర్ రెడ్డి కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతాన్ని మరిచిపోయారా?
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పదవిలో పోచారం భాస్కర్ రెడ్డి కొనసాగడానికి కేటీఆర్, కేసీఆర్ కారణం కాదా? అని యలమంచిలి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి నాయకుడిని తన జీవితంలో చూడలేదని, “కేసీఆర్ నాకు దేవుడు” అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. సర్పంచ్ల విషయంలో స్పష్టత కావాలి !
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల్లో కొందరు ఏకగ్రీవంగా, మరికొందరు పోటీ ద్వారా గెలిచారని, నియోజకవర్గంలో దాదాపు 70 శాతం మంది సర్పంచ్లు, వార్డు సభ్యులు టీఆర్ఎస్కు చెందిన వారేనని తెలిపారు. వారిని కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?
మీరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టత లేకుండా, రాష్ట్రస్థాయి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదని యలమంచిలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలపై సవాల్
దమ్ముంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా బీఫామ్ ఇప్పించాలని, లేదా ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ తరఫున సామాన్య అభ్యర్థులను నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రకటించారు.
సన్మాన కార్యక్రమం
పత్రికా సమావేశం అనంతరం టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన వివిధ మండలాల గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్, బీర్కూర్, వర్ని, చందూర్, తగిలేపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు మోరే కిషన్, తేల రవికుమార్, ఎం.ఏ. హకీమ్, నజీర్, గౌతమ్, ఫారుక్, సమీర్, అయ్యూబ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.