కవి, రచయితలకు అవకాశం కల్పించాలి
భైంసా, డిసెంబర్ 25 (మనోరంజని తెలుగు టైమ్స్):
బాసర ఆలయ పాలకవర్గ మండలిలో కవి, రచయితలకు అవకాశం కల్పించాలని ప్రముఖ కవి, రచయిత, ఆధ్యాత్మికవేత్త జాదవ్ పుండలిక్ రావు ఒక ప్రకటనలో కోరారు. చదువుల తల్లి సరస్వతి నిలయమైన బాసర క్షేత్రంలో సాహిత్య గోష్టీలు, కవి సమ్మేళనాలు, వ్యాస వాంగ్మయం వంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలోని వివిధ కవులు, రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలను బాసర కేంద్రంగా నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యమైందని జాదవ్ పుండలిక్ రావు తెలిపారు.
సాహిత్యం పట్ల అవగాహన కలిగిన విద్యావేత్తలకు ఆలయ పాలకవర్గంలో అవకాశం కల్పిస్తే, ఆధ్యాత్మికతతో పాటు సాహిత్యాభివృద్ధికి మార్గం సుగమమవుతుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కవి, రచయితలు, పండితులకు తగిన స్థానం కల్పించాలి అని జాదవ్ పుండలిక్ రావు విజ్ఞప్తి చేశారు.