వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవ ప్రముఖ చంద్రశేఖర్
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 26
వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ ఎస్ ఎస్ భైంసా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పథ సంచలన్- సార్వజనికోత్సవం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం విశ్వశాంతికి ఆధారం ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పారిశ్రామిక వేత్త నాగ్ నాథ్ పటేల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఈ దేశ అఖండతకు వ్యక్తి నిర్మాణానికి హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందని అన్నారు. స్వయం సేవకులు పట్టణంలోని పలు పురవీధుల గుండా పథ సంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, జిల్లా సహ సంఘ చాలక్ సాదుల కృష్ణ దాస్, పలువురు స్వయంసేవకులు, మహిళలు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.