ప్రభుత్వ ఆసుపత్రిపై ఆకస్మిక తనిఖీ
రోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి – మెరుగైన సేవలందించాలి : జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
మనోరంజని తెలుగు టైమ్స్ – మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సేవలను మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం ఆయన ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించి, సూపరింటెండెంట్ మరియు వివిధ విభాగాల వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ,
“ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల విశ్వాసానికి ప్రతీక. రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి. పారదర్శకతతో సేవలు అందించాలి,” అని సూచించారు.
ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది నిర్వాహన తీరులో లోపాలు, వైద్యులు, పారిశుధ్య సిబ్బంది హాజరు లోపాలు, రోగులపై డబ్బు వసూళ్లు వంటి అంశాలపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే, పారిశుధ్య సిబ్బంది హాజరు 170 మందికి తక్కువ కాకూడదని, విధులకు నిర్లక్ష్యం చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి డాక్టర్, సిబ్బంది సకాలంలో విధులకు హాజరై, రోగులకు సానుభూతితో వైద్య సేవలు అందించాలని తెలిపారు.
గురుకుల పాఠశాలలు, కళాశాలల బాలికలకు గైనకాలజీ సమస్యలపై నెలకు ఒకసారి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, కేటరాక్ట్ ఆపరేషన్లు, ఆరోగ్య శ్రీ సేవలు తదితర అంశాలపై కూడా సమీక్ష జరిపారు.
తదుపరి కలెక్టర్ పాలమూరు రూరల్ మండలం రేగడిగడ్డ తండాలో టపాసులు పేలి గాయపడిన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు.
వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగా అజ్మీరా, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.