జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నామినేషన్లకు ఇవాళే లాస్ట్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్ను అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు BRS నుండి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈరోజు లంకల దీపక్ రెడ్డి మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లను అధికారులు రేపు స్క్రూటినీ చేయనున్నారు. ఈనెల 24 వరకు విత్డ్రాకి అవకాశం ఇచ్చారు.
దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి బైపోల్ వచ్చింది. ఈ స్థానంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈ స్థానాన్ని గెలిచి మరో మారు సత్తా చూపించాలని భావిస్తోంది. అటు పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, జూబ్లీహిల్స్ నుంచే తొలి అడుగేసి గెలుపు రుచిని చూడాలని భావిస్తోంది.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలలో గెలుపొంది రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొంది.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్ర స్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది..