ప్రైవేట్ ఇంజనీరింగ్, వృత్తి విద్యా సంస్థల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి
హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్, వృత్తి విద్యా సంస్థల యాజమాన్యాలు చేపట్టిన బంద్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై ఇప్పటికే సానుకూల చర్యలు చేపడుతున్నప్పటికీ బంద్ పాటించడంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంజనీరింగ్ కాలేజీల విద్యా ప్రమాణాలపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ నివేదికను మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా యాజమాన్యాలు సమ్మె విరమించి కాలేజీలు యథావిధిగా నడిపించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే నేడు చర్చలు జరిపారు. అయితే, కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది..