19న సీజే ప్రమాణస్వీకారం..!!
నేడు ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్కు వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాజ్భవన్లో శనివారం మధ్యాహ్నం 12.30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆయన ఏడో సీజేగా బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది.
సీజే నియామకానికి గత మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇదిలాఉండగా, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్కు బుధవారం ఫుల్కోర్టు ఘన వీడ్కోలు పలకనుంది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఫస్ట్కోర్టు హాల్లో జరిగే వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ సుజోయ్పాల్ 2024, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై కోల్కతా హైకోర్టుకు వెళ్లనున్నారు