M4 న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్: అక్టోబర్ 19
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో, అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
జీవో 29ని రద్దు చేసి, గ్రూప్ 1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఈ విషయంపై హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారు. నేడు, గ్రూప్ 1 అభ్యర్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
వేలాది మంది అభ్యర్థులు ర్యాలీగా అశోక్ నగర్ నుండి సెక్రటేరియట్ వైపు వెళ్ళగా, వారికి బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మద్దతుగా వచ్చారు.
ఈ ఘటనతో, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు గ్రూప్ 1 అభ్యర్థుల మరియు ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లాయి. కొంతమంది అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వందల మంది గ్రూప్ 1 అభ్యర్థులను కూడా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు. అశోక్ నగర్ నుండి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలను పోలీసులు కట్టుదిట్టంగా పహారా చేస్తున్నారు.