తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగ్గుమంటూ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట, మెదక్, నారాయణపేట, నాగర్కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్నగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను వేధిస్తున్నాయి.
ఈ తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలని, తగినన్ని నీళ్లు తాగాలని, తేలికపాటి ఆహారం తీసుకోవాలని వారు తెలిపారు.












