వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని, అందుకు గాను వయోవృద్ధుల సంరక్షణ చట్టం అమలుకు ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య డిమాండ్ చేశారు.
ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా, తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2007లో ప్రవేశపెట్టిన “వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం” అమలు తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేసి వృద్ధుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుందని, అయితే క్షేత్ర స్థాయిలో ఆశించిన విధంగా అమలు జరగడం లేదని ఆయన తెలిపారు.
రెవెన్యూ డివిజన్ అధికారులు తమ సాధారణ ఉద్యోగ బాధ్యతల వల్ల వృద్ధుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని కనకయ్య పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వృద్ధులను బెదిరించి వారి ఆస్తులను తమ పేర్లకు రాయించుకుంటున్నారని, మరికొందరిని ఇంటి నుండి బయటకు పంపించి వృద్ధాశ్రమాల్లో చేర్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి మండల స్థాయిలో సీనియర్ సిటిజన్స్ చట్టం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు వయోవృద్ధుల సంఖ్యపై సర్వే నిర్వహించాలని, గ్రామసభల్లో వారి సంక్షేమం, ఆరోగ్యం, హక్కుల రక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో వయోవృద్ధుల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 14567 గురించి విస్తృత ప్రచారం చేయాలని, వృద్ధుల ఆస్తులను అక్రమంగా ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆస్తులను తిరిగి వృద్ధుల పేర్లకు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సమాజ అభివృద్ధిలో వయోవృద్ధులను మానవ వనరుల అభివృద్ధికి సారథులుగా ప్రభుత్వం గుర్తించాలని నేదునూరి కనకయ్య సూచించారు. మీడియా, ప్రసార మాధ్యమాలు వృద్ధుల హక్కులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.










