ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా ప్రతినిధులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ భవనం జర్నలిస్టుల అవసరాలకు సరిపోకపోవడంతో పాటు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వంటి ఇబ్బందులను డబ్ల్యూజేఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఆధునిక ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని, తాత్కాలికంగా ప్రభుత్వ భవనాలను కేటాయించాలని వారు కోరారు.
అలాగే, డబ్ల్యూజేఐ ప్రతినిధులకు ఖమ్మం జిల్లా అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరగా, జిల్లా కలెక్టర్తో మాట్లాడి స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025లోని కొన్ని నిబంధనలు జిల్లాల్లోని జర్నలిస్టులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డుల పరిమితులు సరిపోవడం లేదని ప్రతినిధులు వివరించారు.
ప్రతి కేటగిరీలో అక్రిడేషన్ కార్డుల సంఖ్యను పెంచాలని, క్రైమ్, స్పోర్ట్స్, కల్చరల్, ఎడ్యుకేషన్, డెస్క్, వెబ్సైట్, ఫ్రీలాన్స్, కేబుల్ టీవీ జర్నలిస్టులకు కూడా కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


