తమిళ బుల్లితెర నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలోని పోరూరులో ఉన్న ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన పిప్పిన్ను వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా షూటింగ్ల కోసం ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా, భర్త బెంగళూరులో ఉంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆదివారం రాత్రి సుభాషిణి తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వాగ్వాదం అనంతరం సుభాషిణి తీవ్ర మనస్తాపానికి గురై, వీడియో కాల్ ముగిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో ఉన్న కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆమె స్నేహితులు కూడా పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
సుభాషిణి కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా ఉండేవారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కయల్' సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కథానాయికగా కూడా నటించిన ఆమెకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం షూటింగ్లతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడిని తట్టుకోలేకపోయారని తెలుస్తోంది.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో కాల్లో అసలు ఏం జరిగింది? ఏ విషయమై గొడవ పడ్డారు? అనే కోణంలో పోలీసులు పిప్పిన్ను కూడా విచారించే అవకాశం ఉంది.








