తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగియనున్న నేపథ్యంలో, మరుసటి రోజు నుండే ఈ పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సుమారు రూ. 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సమకూర్చుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బహిరంగ మార్కెట్ నుండి రుణాన్ని సేకరించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నిధులను విడుదల చేసేందుకు అధికారులు తుది కసరత్తు పూర్తి చేశారు.
గత వానాకాలం సీజన్లో రైతు భరోసా అందుకున్న సుమారు 69.40 లక్షల మంది రైతులకు ఈసారి కూడా ఎకరానికి రూ. 6,000 చొప్పున సాయం అందనుంది. పారదర్శకతను పెంచేందుకు కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే సాయం అందించేలా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, సాగుకు పనికిరాని భూములను ఈ జాబితా నుండి తొలగించినట్లు తెలిసింది.
కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు తమ పేర్ల నమోదు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి పాత జాబితా ప్రకారమే నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. నిధులు విడుదలైన మొదటి రోజు తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుండి ప్రారంభించి, విడతల వారీగా వారం రోజుల్లో రైతులందరికీ ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఈ నిధులు అందనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

