నిర్మల్, 2026-08-06
రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాలను పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాలను పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల సంక్షేమం తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో సమావేశాన్ని ప్రారంభించారు.
సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలి
ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సంప్రదాయ పద్ధతులతో పాటు పంట మార్పిడి విధానాలను తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందని తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
భూ సమస్యల పరిష్కారం, ఎరువుల లభ్యత
భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రసాయన ఎరువుల అధిక వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కమిషన్ సభ్యులు సూచించారు.
నిర్మల్ జిల్లాలో పంటల సాగు
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో పంట మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు వంటి పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు వంటి ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యానవన పంటల విస్తీర్ణం
శ్రీరాంసాగర్, కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల పరిధిలో సాగు విస్తీర్ణం విస్తారంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం దాదాపు 20 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయని, ఇందులో 8,300 ఎకరాల్లో ఆయిల్ పామ్, 5 వేల ఎకరాల్లో పసుపు సాగు జరుగుతోందని తెలిపారు.
భూ సర్వే పనులు
రెవెన్యూ మ్యాపులు లేని 14 గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూములకు సర్వే చేపడుతున్నామని, మరో 70 గ్రామాల్లో 62 వేల ఎకరాల భూముల సర్వే పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భూ భారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.












