దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నుండి పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లకు మారేందుకు వినియోగదారులకు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది. ఈ గడువు తర్వాత, నిర్దేశిత ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉందని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఒక కుటుంబం ఎల్పీజీ మరియు PNG కనెక్షన్ రెండింటినీ కలిగి ఉండకూడదనే నిబంధనను ప్రభుత్వం స్పష్టం చేసింది. పైప్లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట వినియోగదారులు తప్పనిసరిగా PNG కనెక్షన్లకు మారాలి. తమ వద్ద ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను సరెండర్ చేయాలని సూచించింది. ఈ మార్పు కోసం మొదట 90 రోజుల గడువు ఇవ్వగా, అది ఇప్పుడు జూన్ 30తో ముగుస్తుంది.
గడువులోగా PNG కనెక్షన్కు మారడానికి నిరాకరించిన వినియోగదారుల ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే PNG కనెక్షన్ కలిగి ఉండి, ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగిస్తున్నవారు వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, PNG మౌలిక సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో, పైపుల ద్వారా గ్యాస్ వచ్చే వరకు LPG కనెక్షన్లను వినియోగించుకోవడానికి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇప్పటికే PNG కనెక్షన్లకు మారాయి. మార్చి 2026 నాటికి 10.02 లక్షల PNG కనెక్షన్లు గ్యాసిఫికేషన్ చేయబడ్డాయి. మరో 3.22 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో మొత్తం PNG కనెక్షన్ల సంఖ్య 13.24 లక్షలకు చేరుకుంది. దాదాపు 9.94 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
గడువు తేదీకి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రజలు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ముందుగానే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడం ద్వారా వంటగ్యాస్ సరఫరాలో అంతరాయాలను నివారించవచ్చు. తమ ప్రాంతంలో PNG అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఎల్పీజీ సిలిండర్లు వాడుతున్నవారు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలని, లేకపోతే ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ కనెక్షన్ రద్దయ్యే ప్రమాదం ఉందని చమురు కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.












